పవిత్ర గ్రంథాలు

2దినవృత్తాంతములు

అధ్యాయం 15

ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను

ఆసా, యూదావారలారా, బెన్యామీనీయులారా, మీరందరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణచేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును,

నిజమైన దేవుడైనను ఉపదేశముచేయు యాజకులైనను, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండపోవును.

తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్దకు మళ్లుకొని ఆయనను వెదకినపుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను.

ఆ కాలములలో దేశముల కాపురస్థులందరిలోను గొప్ప కల్లోలములు కలిగెను గనుక తమ పనిపాటలను చక్కపెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను.

దేవుడు జనములను సకలవిధములైన బాధలతో శ్రమపరచెను గనుక జనము జనమును, పట్టణము పట్టణమును, పాడుచేసెను.

కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.

ప్రవక్తయైన ఓదేదు ప్రవచించిన యీ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటినుండియు, ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలోనుండియు హేయములైన విగ్రహములన్నిటిని తీసివేసి, యెహోవా మంటపము ఎదుటనుండు యెహోవా బలిపీఠమును మరల కట్టించి

యూదా వారినందరిని బెన్యామీనీయులనందరిని, ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలోనుండి వచ్చి వారిమధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడై యుండుట చూచి ఇశ్రాయేలువారిలోనుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి.

ఆసా యేలుబడియందు పదునైదవ సంవత్సరమున మూడవ నెలను వారు యెరూషలేములో కూడి

తాము తీసికొనివచ్చిన కొల్లసొమ్ములోనుండి ఆ దినమున ఏడువందల యెద్దులను ఏడువేల గొఱ్ఱలను యెహోవాకు బలులుగా అర్పించి

పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవాయొద్ద తాము విచారణ చేయుదుమనియు

పిన్నలేగాని పెద్దలేగాని పురుషులేగాని స్త్రీలే గాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాయొద్ద విచారణ చేయనివారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసికొనిరి.

వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.

ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరును సంతోషించిరి; వారు పూర్ణహృదయముతో ప్రమాణముచేసి పూర్ణమనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టునున్న దేశస్థులతో యుద్ధములు లేకుండ వారికి నెమ్మది కలుగజేసెను.

మరియు తన తల్లియైన మయకా అసహ్యమైన యొక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె యిక పట్టపుదేవియై యుండకుండ రాజైన ఆసా ఆమెను త్రోసివేసి, ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి ఛిన్నాభిన్నము చేసి కిద్రోను వాగుదగ్గర దాని కాల్చివేసెను.

ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలోనుండి తీసివేయలేదు గాని యితడు బ్రదికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను.

తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు, తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసికొని దేవుని మందిరమునందుంచెను.

ఆసా యేలుబడియందు ముప్పది యయిదవ సంవత్సరమువరకు యుద్ధములు జరుగలేదు.