2దినవృత్తాంతములు
అధ్యాయం 9
షేబదేశపు రాణి సొలొమోనునుగూర్చిన ప్రసిద్ధిని వినినప్పుడు గూఢమైన ప్రశ్నలచేత సొలొమోనును శోధింపవలెనని కోరి, మిక్కిలి గొప్ప పరివారమును వెంటబెట్టుకొని, గంధవర్గములను విస్తారము బంగారమును రత్నములను ఒంటెలమీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె సొలొమోనునొద్దకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గురించి అతనితో మాటలాడెను.
సొలొమోను ఆమె ప్రశ్నలన్నియు ఆమెకు విడదీసి చెప్పెను; సొలొమోను ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట యేదియు లేకపోయెను.
షేబ దేశపు రాణి సొలొమోనునకు కలిగిన జ్ఞానమును, అతడు కట్టించిన నగరును,
అతని బల్లమీది భోజనపదార్థములను, అతని సేవకులు కూర్చుండుటను, అతని యుపచారులు కనిపెట్టుటను వారి వస్త్రములను, అతనికి గిన్నెలనందించువారిని వారి వస్త్రములను, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహనబలులను చూచినప్పుడు, ఆమె విస్మయమొంది రాజుతో ఇట్లనెను
నీ కార్యములనుగూర్చియు జ్ఞానమునుగూర్చియు నేను నా దేశమందు వినిన వర్తమానము నిజవర్తమానమే గాని, నేను వచ్చి దాని కన్నులార చూచువరకు వారి మాటలను నమ్మకయుంటిని.
నీ యధిక జ్ఞానమునుగూర్చి సగమైనను వారు నాకు తెలుపలేదు. నిన్నుగూర్చి నేను వినినదానికంటె నీ కీర్తి యెంతో హెచ్చుగానున్నది.
నీ సేవకుల భాగ్యము మంచిది, ఎల్లప్పుడును నీ సముఖమున నిలిచి నీ జ్ఞానసంభాషణ వినుచుండు నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది.
నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనముమీద ఆసీనుడవై యుండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలెనన్న దయాలోచన నీ దేవునికి కలిగియున్నందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారిమీద రాజుగా నియమించెను అని చెప్పెను.
ఆమె రాజునకు రెండువందల నలుబది మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను; షేబ దేశపు రాణి రాజైన సొలొమోనున కిచ్చిన గంధవర్గములతో సాటియైన దేదియులేదు.
ఇదియుగాక ఓఫీరునుండి బంగారము తెచ్చిన హీరాము పనివారును సొలొమోను పనివారును చందనపు మ్రానులను ప్రశస్తమైన రత్నములనుకూడ కొనివచ్చిరి.
ఆ చందనపు మ్రానులచేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరునకును సౌపానములను, గాయకులకు తంబురలను సితారాలను చేయించెను, అటువంటి పని అంతకుముందు యూదాదేశమందు ఎవ్వరును చూచియుండలేదు.
షేబ దేశపు రాణి రాజునకు తీసికొనివచ్చిన వాటికి అతడిచ్చిన ప్రతి బహుమానములు గాక ఆమె మక్కువ పడి అడిగినదంతయు రాజైన సొలొమోను ఆమెకిచ్చెను; తరువాత ఆమె తన సేవకులను వెంటబెట్టుకొని మరలి తన దేశమునకు వెళ్లిపోయెను.
గంధవర్గములు అమ్ము వర్తకులును ఇతర వర్తకులును కొనివచ్చు బంగారము గాక సొలొమోనునకు ఏటేట వచ్చు బంగారము వెయ్యిన్ని మూడువందల ముప్పది రెండు మణుగుల యెత్తు.
అరబీదేశపు రాజులందరును దేశాధిపతులును సొలొమోనునొద్దకు బంగారమును వెండియు తీసికొనివచ్చిరి.
రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారముతో అలుగులుగల రెండువందల డాళ్లను చేయించెను; ఒక్కొక డాలునకు ఆరువందల తులముల బంగారము పట్టెను.
మరియు సాగగొట్టిన బంగారముతో మూడువందల కేడెములను చేయించెను; ఒక్కొక కేడెమునకు మూడువందల తులముల బంగారము పట్టెను; వాటిని రాజు లెబానోను అరణ్యపు నగరునందుంచెను.
మరియు రాజు దంతముతో ఒక గొప్ప సింహాసనము చేయించి ప్రశస్తమైన బంగారముతో దాని పొదిగించెను.
ఆ సింహాసనమునకు దానితో కలిసియున్న ఆరు బంగారపు సోపానములును సింహాసనమునకు కట్టియున్న బంగారపు పాదపీఠమును ఉండెను, కూర్చుండుచోటికి ఇరుప్రక్కల ఊతలుండెను, ఊతలదగ్గర రెండు సింహములుండెను;
ఆ యారు సోపానములమీద ఇరుప్రక్కల పండ్రెండు సింహములు నిలిచియుండెను, ఏ రాజ్యమందైనను అటువంటి పని చేయబడలేదు.
మరియు రాజైన సొలొమోనునకున్న పానపాత్రలన్నియును బంగారపువై యుండెను; లెబానోను అరణ్యపు నగరుననున్న ఉపకరణములన్నియు బంగారముతో చేసినవి; హీరాముయొక్క పనివారితో కూడ రాజు ఓడలు తర్షీషుకు పోయి మూడు సంవత్సరములకు ఒక మారు బంగారము, వెండి, యేనుగు దంతము, కోతులు, నెమళ్లు అను సరకులతో వచ్చుచుండెను గనుక
సొలొమోను దినములలో వెండి యెన్నికకు రానిదాయెను
రాజైన సొలొమోను భూరాజులందరికంటెను ఐశ్వర్యమందును జ్ఞానమందును అధికుడాయెను.
దేవుడు సొలొమోనుయొక్క హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరును అతని ముఖదర్శనము చేయగోరిరి.
మరియు ప్రతివాడును ఏటేట వెండి వస్తువులను బంగారు వస్తువులను వస్త్రములను ఆయుధములను గంధవర్గములను గుఱ్ఱములను కంచరగాడిదలను కానుకలుగా తీసికొనివచ్చెను.
రథములు నిలువయుంచు పట్టణములలోను రాజునొద్ద యెరూషలేములోను సొలొమోనునకు నాలుగువేల గుఱ్ఱపు సాలలును రథములును పండ్రెండువేల గుఱ్ఱపు రౌతులును కలిగియుండెను.
యూఫ్రటీసు నది మొదలుకొని ఫిలిష్తీయుల దేశమువరకును ఐగుప్తు సరిహద్దువరకును ఉండు రాజులందరి పైని అతడు ఏలుబడి చేసెను.
రాజు యెరూషలేమునందు వెండి రాళ్లంత విస్తారముగా నుండునట్లును, దేవదారు మ్రానులు షెఫేలా ప్రదేశముననున్న మేడివృక్షములంత విస్తారముగా నుండునట్లును చేసెను.
ఐగుప్తునుండియు సకల దేశములనుండియు సొలొమోనునకు గుఱ్ఱములు తేబడెను.
సొలొమోను చేసిన కార్యములన్నిటినిగూర్చి ప్రవక్తయైన నాతాను రచించిన గ్రంథమందును, షిలోనీయుడైన అహీయా రచించిన ప్రవచన గ్రంథమందును, నెబాతు కుమారుడైన యరొబామునుగూర్చి దీర్ఘదర్శియైన ఇద్దోకు గ్రంథమందును వ్రాయబడియున్నది.
సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిమీద నలుబది సంవత్సరములు ఏలుబడి చేసెను.
తరువాత సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి తన తండ్రియైన దావీదు పట్టణమందు పాతిపెట్టబడెను; అతనికి బదులుగా అతని కుమారుడైన రెహబాము రాజాయెను.