పవిత్ర గ్రంథాలు

2దినవృత్తాంతములు

అధ్యాయం 14

అబీయా తన పితరులతో కూడ నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి; అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయెను. ఇతని దినములలో దేశము పది సంవత్సరములు నెమ్మది పొందెను.

ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడచినవాడై

అన్యదేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడుచేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి

వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, ధర్మశాస్త్రమునుబట్టియు విధినిబట్టియు క్రియలు జరిగించుటకును, యూదావారికి ఆజ్ఞాపించి

ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.

ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుటచేత దేశములో నెమ్మదికలిగియుండెను; యెహోవా అతనికి విశ్రాంతి దయచేసియుండగా అతడు యూదా దేశమున ప్రాకారములుగల పట్టణములను కట్టించెను.

అతడు యూదావారికి ఈలాగు ప్రకటన చేసెను మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితివిు, ఆశ్రయించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసియున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగవచ్చును, మనము ఈ పట్టణములను కట్టించి, వాటికి ప్రాకారములను గోపురములను గుమ్మములను ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధినొందిరి.

ఆ కాలమున డాళ్లను ఈటెలను పట్టుకొను మూడు లక్షలమంది యూదావారును, కేడెములు ధరించి విల్లువేయు రెండు లక్షల ఎనుబది వేలమంది బెన్యామీనీయులును కూడిన సైన్యము ఆసాకు ఉండెను; వీరందరును పరాక్రమశాలులై యుండిరి.

కూషీయుడైన జెరహు వారిమీద దండెత్తి వేయి వేల సైన్యమును మూడువందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషావరకు రాగా ఆసా అతనికి ఎదురుబోయెను.

వారు మారేషానొద్ద జెపాతా అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా

ఆసా తన దేవుడైన యెహోవాకు మొఱ్ఱపెట్టి యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండ బలములేనివారికి సహాయము చేయుటకు నీకన్న ఎవరును లేరు; మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమునుబట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరియున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము అని ప్రార్థింపగా

యెహోవా ఆ కూషీయులను ఆసా యెదుటను యూదావారి యెదుటను నిలువనియ్యక వారిని మొత్తినందున వారు పారిపోయిరి.

ఆసాయును అతనితో కూడనున్న వారును గెరారువరకు వారిని తరుమగా కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయముచేతను ఆయన సైన్యపు భయముచేతను పారిపోయిరి. యూదావారు విశేషమైన కొల్లసొమ్ము పట్టుకొనిరి.

గెరారు చుట్టునున్న పట్టణములలోని వారందరి మీదికి యెహోవా భయము వచ్చెను గనుక ఆ పట్టణములన్నిటిని కొల్లపెట్టి, వాటిలోనున్న మిక్కుటమైన కొల్లసొమ్మంతయు దోచుకొనిరి.

మరియు వారు పసులసాలలను పడగొట్టి విస్తారమైన గొఱ్ఱలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునకు తిరిగివచ్చిరి.