2దినవృత్తాంతములు
అధ్యాయం 8
సొలొమోను యెహోవా మందిరమును తన నగరును కట్టించిన యిరువది సంవత్సరముల కాలము తీరిన తరువాత
హీరాము తనకిచ్చిన పట్టణములను సొలొమోను కట్టించి వాటిలో ఇశ్రాయేలీయులను కాపురముంచెను.
తరువాత సొలొమోను హమాతుసొబా అను స్థలమునకు పోయి దానిని పట్టుకొనెను.
మరియు అరణ్యమందుండు తద్మోరుకును హమాతు దేశమందు ఖజానా ఉంచు పట్టణములన్నిటికిని ప్రాకారములను కట్టించెను.
ఇదియు గాక అతడు ఎగువ బేత్హోరోను దిగువ బేత్హోరోను గవునులు అడ్డగడలుగల ప్రాకార పట్టణములుగా కట్టించెను.
బయలతును, ఖజానా ఉంచు పట్టణములన్నిటిని, రథములుంచు పట్టణములన్నిటిని, గుఱ్ఱపు రౌతులుండు పట్టణములన్నిటిని కట్టించెను. మరియు యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలు దేశములన్నిటియందును ప్రాకారపురములుగా కట్టించవలెనని తానుద్దేశించిన పట్టణములన్నిటిని సొలొమోను కట్టించెను.
ఇశ్రాయేలీయుల సంబంధులు కాని హిత్తీయులలోనుండియు అమోరీయులలోనుండియు, పెరిజ్జీయులలోనుండియు, హివ్వీయులలోనుండియు, యెబూసీయులలోనుండియు, శేషించియున్న సకల జనులను
ఇశ్రాయేలీయులు నాశనముచేయక వదలివేసిన ఆ యా జనుల సంతతివారిని సొలొమోను నేటివరకును తనకు వెట్టిపనులు చేయువారినిగా చేసికొనియుండెను.
అయితే ఇశ్రాయేలీయులలో ఒకనినైనను సొలొమోను తన పనిచేయుటకు దాసునిగా నియమింపలేదు; వారిని యోధులుగాను తన అధిపతులలో ప్రధానులుగాను రథములకును గుఱ్ఱపు రౌతులకును అధిపతులుగాను నియమించెను.
వీరిలో శ్రేష్ఠులైన రెండువందల ఏబదిమంది రాజైన సొలొమోను క్రింద అధిపతులై ప్రజలమీద అధికారులై యుండిరి.
ఇశ్రాయేలీయుల రాజైన దావీదు నగరునందు నా భార్య నివాసము చేయవలదు, యెహోవా మందసమున్న స్థలములు ప్రతిష్ఠితములు అని చెప్పి, సొలొమోను ఫరో కుమార్తెను దావీదు పట్టణమునుండి తాను ఆమె కొరకు కట్టించిన నగరునకు రప్పించెను.
అది మొదలుకొని సొలొమోను తాను మంటపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠముమీద దహనబలులు అర్పించుచు వచ్చెను. అతడు అనుదిన నిర్ణయముచొప్పున
మోషే యిచ్చిన ఆజ్ఞనుబట్టి విశ్రాంతిదినములయందును, అమావాస్యలయందును, నియామక కాలములయందును, సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగలయందును, అనగా పులియని రొట్టెల పండుగయందును వారముల పండుగయందును పర్ణశాలల పండుగయందును యెహోవాకు దహనబలులు అర్పించుచు వచ్చెను.
అతడు తన తండ్రియైన దావీదు చేసిన నిర్ణయమునుబట్టి వారి వారి సేవాధర్మములను జరుపుకొనుటకై వారి వారి వంతుల చొప్పున యాజకులను వారి సేవకును, కట్టడనుబట్టి అనుదినమున యాజకుల సముఖమున స్తుతి చేయుటకును, ఉపచారకులుగా ఉండుటకును, వంతులచొప్పున లేవీయులను, ద్వారములన్నిటి దగ్గర కావలియుండుటకై వారి వారి వంతులచొప్పున ద్వారపాలకులను నియమించెను; దైవజనుడైన దావీదు ఆలాగుననే యాజ్ఞ ఇచ్చియుండెను.
ఏ విషయమును గూర్చియే గాని బొక్కసములను గూర్చియే గాని రాజు యాజకులకును లేవీయులకును చేసియున్న నిర్ణయమునుబట్టి వారు సమస్తమును జరుపుచువచ్చిరి
యెహోవా మందిరమునకు పునాదివేసిన దినము మొదలుకొని అది సంపూర్ణమగువరకు సొలొమోను పనియంతయు చేయించెను; అప్పుడు యెహోవా మందిరము సమాప్తమాయెను.
సొలొమోను ఎదోము దేశముయొక్క సముద్రపు దరినున్న ఎసోన్గెబెరునకును ఏలతునకును పోగా
హీరాము తన పనివారిద్వారా ఓడలను ఓడ నడుపుటయందు యుక్తి గల పనివారిని పంపెను. వీరు సొలొమోను పనివారితో కూడ ఓఫీరునకు పోయి అక్కడనుండి తొమ్మిదివందల మణుగుల బంగారమును ఎక్కించుకొని రాజైన సొలొమోను నొద్దకు తీసికొనివచ్చిరి.