2సమూయేలు
అధ్యాయం 14
రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని2 సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.
కాగా తెకోవ ఊరి స్త్రీ రాజునొద్దకువచ్చి సాగిలపడి సమస్కారము చేసి రాజా రక్షించుమనగా
రాజు నీకేమి కష్టము వచ్చెనని అడిగెను. అందుకు ఆమె నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను;
నీ దాసినైన నాకు ఇద్దరు కుమారులు ఉండిరి, వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించు వాడెవడును లేకపోయినందున వారిలో నొకడు రెండవవాని కొట్టి చంపెను.
కాబట్టి నా యింటివారందరును నీ దాసినైన నామీదికి లేచి తన సహోదరుని చంపినవాని అప్పగించుము; తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారుని నాశనముచేతు మనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమిమీద పేరైనను శేషమైనను లేకుండ మిగిలిన నిప్పురవను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా
రాజు నీవు నీ యింటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను.
అందుకు తెకోవ ఊరి స్త్రీనా యేలినవాడా రాజా, దోషము నామీదను నాతండ్రి ఇంటివారిమీదను నిలుచునుగాక, రాజునకును రాజు సింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా
రాజు ఎవడైనను దీనినిగూర్చి నిన్నేమైన అనినయెడల వానిని నాయొద్దకు తోడుకొనిరమ్ము; వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పెను.
అప్పుడు ఆమె రాజవైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండ ఇకను నాశనము చేయుట మాన్పించుమని మనవిచేయగా రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెండ్రుకలలో ఒకటైనను నేల రాలకుండుననెను.
అప్పుడు ఆ స్త్రీనా యేలినవాడవగు నీతో ఇంకొక మాటచెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవిచేయగా రాజు చెప్పుమనెను.
అందుకు ఆ స్త్రీ దేవుని జనులైనవారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుటచేత తాను వెళ్లగొట్టిన తనవాని రానియ్యక తానే దోషియగుచున్నాడు.
మనమందరమును చనిపోదుము గదా, నేలను ఒలికినమీదట మరల ఎత్తలేని నీటివలె ఉన్నాము; దేవుడు ప్రాణముతీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు.
జనులు నన్ను భయపెట్టిరి గనుక నేను దీనినిగూర్చి నా యేలినవాడవగు నీతో మాటలాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చేయునేమో
రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండ నన్నును నా కుమారునిని నాశనము చేయదలచిన వాని చేతిలోనుండి తన దాసినగు నన్ను విడిపించునేమో అనుకొంటిని.
మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడైయున్నాడు గనుక నా యేలినవాడవును రాజవునగు నీవు దేవుని దూతవంటివాడవై మంచి చెడ్డలన్నియు విచారింప చాలియున్నావు; కాబట్టి నీ దాసినగు నేను నా యేలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.
రాజునేను నిన్ను అడుగు సంగతి నీ వెంతమాత్రమును మరుగు చేయవద్దని ఆ స్త్రీతో అనగా ఆమె నా యేలినవాడవగు నీవు సెలవిమ్మనెను.
అంతట రాజు యోవాబు నీకు బోధించెనా అని ఆమె నడిగినందుకు ఆమె యిట్లనెను నా యేలినవాడవైన రాజా, నీ ప్రాణముతోడు, చెప్పినదానిని తప్పక గ్రహించుటకు నా యేలినవాడవును రాజవునగు నీవంటివాడొకడును లేడు; నీ సేవకుడగు యోవాబు నాకు బోధించి యీ మాటలన్నిటిని నీ దాసినగు నాకు నేర్పెను
సంగతిని రాజుతో మరుగుమాటలతో మనవి చేయుటకు నీ సేవకుడగు యోవాబు ఏర్పాటు చేసెను. ఈ లోకమందు సమస్తమును ఎరుగుటయందు నా యేలినవాడవగు నీవు దేవదూతల జ్ఞానమువంటి జ్ఞానము గలవాడవు.
అప్పుడు రాజు యోవాబుతో ఈలాగున సెలవిచ్చెను. ఆలకించుము, నీవు మనవి చేసినదానిని నేను ఒప్పుకొనుచున్నాను.
తరువాత యౌవనుడగు అబ్షాలోమును రప్పింపుమని అతడు సెలవియ్యగా యోవాబు సాష్టాంగ నమస్కారము చేసి రాజును స్తుతించి రాజవగు నీవు నీ దాసుడనైన నా మనవి అంగీకరించినందున నా యేలిన వాడవగు నీవలన నేను అనుగ్రహము నొందితినని నాకు తెలిసెనని చెప్పి లేచి గెషూరునకు పోయి
అబ్షాలోమును యెరూషలేమునకు తోడుకొని వచ్చెను.
అయితే రాజు అతడు నా దర్శనము చేయక తన ఇంటికి పోవలెనని ఉత్తరవు చేయగా అబ్షాలోము రాజదర్శనము చేయక తన ఇంటికి పోయెను.
ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు; అరికాలు మొదలుకొని తలవరకు ఏ లోపమును అతనియందు లేకపోయెను.
తన తల వెండ్రుకలు భారముగా నున్నందున ఏటేట అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను; కత్తిరించునప్పుడెల్ల వాటి యెత్తు రాజు తూనికనుబట్టి రెండువందల తులములాయెను.
అబ్షాలోమునకు ముగ్గురు కుమారులును తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి; ఆమె బహు సౌందర్యవతి.
అబ్షాలోము రెండు నిండు సంవత్సరములు యెరూషలేములోనుండియు రాజదర్శనము చేయక యుండగా
యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము అతనిని పిలువనంపినప్పుడు యోవాబు రానొల్లక యుండెను. రెండవమారు అతని పిలువనంపినప్పుడు అతడు రానొల్లక పోగా
అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలము నా పొలముదగ్గర నున్నది గదా, దానిలో యవల చేలు ఉన్నవి; మీరు పోయి వాటిని తగులబెట్టుడని వారితో చెప్పెను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగులబెట్టగా
యావాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా
అబ్షాలోము యోవాబుతో ఇట్లనెను గెషూరునుండి నేను వచ్చిన ఫలమేమి? నేనచ్చటనే యుండుట మేలని నీద్వారా రాజుతో చెప్పుకొనుటకై రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిచితిని; రాజదర్శనము నేను చేయవలెను; నాయందు దోషము కనబడినయెడల రాజు నాకు మరణశిక్ష విధింపవచ్చును.
అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా, రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దుపెట్టుకొనెను.