పవిత్ర గ్రంథాలు

2సమూయేలు

అధ్యాయం 23

దావీదు రచించిన చివరి మాటలు ఇవే; యెష్షయి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి యిదే; యాకోబు దేవునిచేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి యిదే.

యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది.

ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నాద్వారా మాటలాడుచున్నాడు. మనుష్యులను ఏలు నొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవునియందు భయభక్తులు గలిగి యేలును.

ఉదయకాలపు సూర్యోదయ కాంతివలెను మబ్బు లేకుండ ఉదయించిన సూర్యునివలెను వర్షము కురిసినపిమ్మట నిర్మలమైన కాంతిచేత భూమిలోనుండి పుట్టిన లేత గడ్డివలెను అతడు ఉండును.

నా సంతతివారు దేవుని దృష్టికి అనుకూలులే గదా ఆయన నాతో నిత్యనిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయెను, దేవునికి పూర్ణానుకూలము అది నాకనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును.

ఒకడు ముండ్లను చేత పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు.

ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను వినియోగించును గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు ఉన్నచోటనే కాల్చివేయుదురు.

దావీదు అనుచరులలో బలాఢ్యులెవరనగా యోషే బెష్షెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు; అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని హతము చేసెను.

ఇతని తరువాతివాడు అహోహీయుడైన దోదో కుమారుడైన ఎలియాజరు, ఇతడు దావీదు ముగ్గురు బలాఢ్యులలో ఒకడు. యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను తిరస్కరించి డీకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లిపోగా ఇతడు లేచి

చేయి తిమ్మిరిగొని కత్తి దానికి అంటుకొనిపోవువరకు ఫిలిష్తీయులను హతము చేయుచు వచ్చెను. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను. దోపుడుసొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి.

ఇతని తరువాతి వారెవరనగా హరారీయుడగు ఆగే కుమారుడైన షమ్మా; ఫిలిష్తీయులు అలచందల చేనిలో గుంపుకూడగా జనులు ఫిలిష్తీయులయెదుట నిలువలేక పారిపోయిరి.

అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిష్తీయులు దానిమీదికి రాకుండ వారిని వెళ్లగొట్టి వారిని హతము చేయుటవలన యెహోవా ఇశ్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను.

మరియు ముప్పదిమంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొద్దకు వచ్చినప్పుడు ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో దండు దిగియుండిరి,

దావీదు దుర్గములో నుండెను, ఫిలిష్తీయుల దండు కావలివారు బేత్లెహేములో ఉండిరి.

దావీదు బేత్లెహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి యిచ్చినయెడల ఎంతో సంతోషించెదనని అధికారితో పలుకగా

ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలివారిని ఓడించి, దారి చేసికొని పోయి బేత్లెహేము గవిని దగ్గరనున్న బావినీళ్లు చేది దావీదునొద్దకు తీసికొనివచ్చిరి; అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సులేక యెహోవా సన్నిధిని పారబోసి యెహోవా, నేను ఇవి త్రాగను;

ప్రాణమునకు తెగించి పోయి తెచ్చినవారి చేతి నీళ్లు త్రాగుదునా? అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆ ముగ్గురు బలాఢ్యులు ఈ కార్యములు చేసిరి.

సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అబీషై తన అనుచరులలో ముఖ్యుడు. ఇతడొక యుద్ధములో మూడువందలమందిని హతముచేసి వారిమీద తన యీటెను ఆడించెను. ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు.

ఇతడు ఆ ముప్పదిమందిలో ఘనుడై వారికి అధిపతియాయెను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను.

మరియు కబ్సెయేలు ఊరివాడై క్రియలచేత ఘనతనొందిన యొక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను. ఇతడు మోయాబీయుల సంబంధులగు ఆ యిద్దరు శూరులను హతముచేసెను; మరియు మంచుకాలమున బయలువెడలి బావిలో దాగియున్న యొక సింహమును చంపివేసెను.

ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక ఐగుప్తీయుని చంపెను. ఈ ఐగుప్తీయునిచేతిలో ఈటెయుండగా బెనాయా దుడ్డుకఱ్ఱ తీసికొని వాని మీదికి పోయి వానిచేతిలోని యీటె ఊడలాగి దానితోనే వాని చంపెను.

ఈ కార్యములు యెహోయాదా కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోను అతడు పేరుపొంది

ఆ ముప్పది మందిలో ఘనుడాయెను. అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను. దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను.

ఆ ముప్పదిమంది యెవరనగా, యోవాబు సహోదరుడైన అశాహేలు, బేత్లెహేమీయుడగు దోదో కుమారుడగు ఎల్హానాను,

హరోదీయుడైన షమ్మా, హరోదీయుడైన ఎలీకా,

పత్తీయుడైన హేలెస్సు, తెకోవీయుడగు ఇక్కేషు కుమారుడైన ఈరా,

అనాతోతీయుడైన అబీయెజరు, హుషాతీయుడైన మెబున్నయి,

అహోహీయుడైన సల్మోను, నెటోపాతీయుడైన మహరై

నెటోపాతీయుడైన బయానాకు పుట్టిన హేలెబు, బెన్యామీనీయుల గిబియాలో పుట్టిన రీబై కుమారుడైన ఇత్తయి,

పరాతోనీయుడైన బెనాయా, గాయషు ఏళ్లనడుమ నివసించు హిద్దయి,

అర్బాతీయుడైన అబీయల్బోను, బర్హుమీయుడైన అజ్మావెతు,

షయల్బోనీయుడైన ఎల్యహ్బా, యాషేను యొక్క కుమారులలో యోనాతాను,

హరారీయుడైన షమ్మా, హరారీయుడైన షారారు నకు పుట్టిన అహీయాము,

మాయాకాతీయునికి పుట్టిన అహస్బయి కుమారుడైన ఎలీపేలెటు, గిలోనీయుడైన అహీతో పెలు కుమారుడగు ఏలీయాము,

కర్మెతీయుడైన హెస్రై, అర్బీయుడైన పయరై,

సోబావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు, గాదీయుడైన బానీ,

అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై, యితడు సెరూయా కుమారుడగు యోవాబుయొక్క ఆయుధములను మోయువాడై యుండెను.

ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు,

హిత్తీయుడైన ఊరియా. వారందరు ముప్పది యేడుగురు.