పవిత్ర గ్రంథాలు

2సమూయేలు

అధ్యాయం 8

దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపరచుకొని వారి వశములోనుండి మెతెగమ్మాను పట్టుకొనెను.

మరియు అతడు మోయాబీయులను ఓడించి, (పట్టుబడిన వారిని) నేలపొడుగున పండజేసి, తాడుతో కొలిచి రెండు తాడుల పొడుగుననున్నవారు చావవలెననియు, ఒకతాడు పొడుగుననున్నవారు బ్రతుకవచ్చుననియు నిర్ణయించెను. అంతట మోయాబీయులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి.

సోబా రాజును రెహోబు కుమారుడునగు హదదెజరు యూఫ్రటీసు నదివరకు తన రాజ్యమును వ్యాపింపజేయవలెనని బయలుదేరగా దావీదు అతని నోడించి

అతనియొద్దనుండి వెయ్యిన్ని యేడు వందలమంది గుఱ్ఱపు రౌతులను ఇరువది వేల కాల్బలమును పట్టుకొని, వారి గుఱ్ఱములలో నూటిని ఉంచుకొని, మిగిలినవాటికి చీలమండ నరములను తెగవేయించెను.

మరియు దమస్కులోనున్న సిరియనులు సోబా రాజగు హదదెజెరునకు సహాయము చేయరాగా దావీదు సిరియనులలో ఇరువదిరెండు వేలమందిని ఓడించి

దమస్కు వశముననున్న సిరియదేశమందు దండును ఉంచగా, సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

హదదెజెరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేమునకు తీసికొనివచ్చెను.

మరియు బెతహు బేరోతై అను హదదెజెరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన యిత్తడిని పట్టుకొనెను.

దావీదు హదదెజెరు దండు అంతయు ఓడించిన సమాచారము హమాతు రాజైన తోయికి వినబడెను.

హదదె జెరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదెజెరుతో యుద్ధము చేసి అతనిని ఓడించియుండుట తోయి విని, తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారు ఇత్తడి వస్తువులను కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలడిగి దావీదుతోకూడ సంతోషించుటకై అతనిని దావీదు నొద్దకు పంపెను.

రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.

వాటిని అతడు సిరియనుల యొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీయుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబా రాజునొద్దనుండియు పట్టుకొనియుండెను.

దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగిరాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.

మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.

దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనులనందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.

సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.

అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులకును పెలేతీయులకును అధిపతి; దావీదు కుమారులు సభా ముఖ్యులు.