పవిత్ర గ్రంథాలు

యోబు

అధ్యాయం 29

యోబు ఇంకొకసారి ఉపమానరీతిగా ఇట్లనెను

పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు

అప్పుడు ఆయన దీపము నా తలకుపైగా ప్రకాశించెను ఆయన తేజమువలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని.

నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండినయెడల ఎంతో మేలు అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను.

సర్వశక్తుడు ఇంకను నాకు తోడైయుండెను నా పిల్లలు నా చుట్టునుండిరి

నేను పెట్టిన అడుగెల్ల నేతిలో పడెను బండనుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను.

పట్టణపు గుమ్మమునకు నేను వెళ్లినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు

యౌవనులు నన్ను చూచి దాగుకొనిరి ముసలివారు లేచి నిలువబడిరి.

అధికారులు మాటలాడుట మాని నోటిమీద చెయ్యివేసికొనిరి.

ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.

నా సంగతి చెవినిబడిన ప్రతివాడు నన్ను అదృష్ట వంతునిగా ఎంచెను. నేను కంటబడిన ప్రతివాడు నన్నుగూర్చి సాక్ష్యమిచ్చెను.

ఏలయనగా మొఱ్ఱపెట్టిన దీనులను తండ్రిలేనివారిని సహాయములేనివారిని నేను విడిపించితిని.

నశించుటకు సిద్ధమైయున్నవారి దీవెన నామీదికి వచ్చెను విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టితిని

నేను నీతిని వస్త్రముగా ధరించుకొని యుంటిని గనుక అది నన్ను ధరించెను నా న్యాయప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయెను.

గ్రుడ్డివారికి నేను కన్నులైతిని కుంటివారికి పాదములైతిని.

దరిద్రులకు తండ్రిగా ఉంటిని ఎరుగనివారి వ్యాజ్యెమును నేను శ్రద్ధగా విచారించితిని.

దుర్మార్గుల దవడపళ్లను ఊడగొట్టితిని. వారి పళ్లలోనుండి దోపుడుసొమ్మును లాగివేసితిని.

అప్పుడు నేనిట్లనుకొంటిని నా గూటియొద్దనే నేను చచ్చెదను హంసవలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును.

నా వేళ్లచుట్టు నీళ్లు వ్యాపించును మంచు నా కొమ్మలమీద నిలుచును.

నాకు ఎడతెగని ఘనత కలుగును నాచేతిలో నా విల్లు ఎప్పటికిని బలముగా నుండును.

మనుష్యులు నాకు చెవియొగ్గి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వినవలెనని మౌనముగా ఉండిరి.

నేను మాటలాడిన తరువాత వారు మారుమాట పలుకకుండిరి. గుత్తులు గుత్తులుగా నా మాటలు వారిమీద పడెను.

వర్షముకొరకు కనిపెట్టునట్లు వారు నాకొరకు కనిపెట్టుకొనిరి కడవరి వానకొరకైనట్లు వారు వెడల్పుగా నోరుతెరచుకొనిరి.

వారు ఆశారహితులై యుండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖప్రకాశము లేకుండ వారేమియు చేయరైరి.

నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచితిని సేనలో రాజువలెను దుఃఖించువారిని ఓదార్చువానివలెను నేనుంటిని.