పవిత్ర గ్రంథాలు

మార్కు

అధ్యాయం 12

ఆయన ఉపమానరీతిగా వారికి బోధింప నారంభించెను; ఎట్లనగాఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి, దానిచుట్టు కంచెవేయించి, ద్రాక్షలతొట్టి తొలిపించి గోపురము కట్టించి, కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను.

పంటకాలమందు ఆ కాపులనుండి ద్రాక్షతోట పండ్లలో తన భాగము తీసికొనివచ్చుటకు, కాపులయొద్దకు అతడు ఒక దాసుని పంపగా

వారు వాని పట్టుకొని కొట్టి, వట్టిచేతులతో పంపివేసిరి.

మరల అతడు మరియొక దాసుని వారియొద్దకు పంపగా, వారు వాని తల గాయముచేసి అవమానపరచిరి.

అతడు మరియొకని పంపగా వానిని చంపిరి. అతడింక అనేకులను పంపగా, వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి.

ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారియొద్దకు అతనిని పంపెను.

అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని

అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి.

కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు

ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను

ఇది ప్రభువువలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదువలేదా? అని అడుగగా

తమ్మునుగూర్చి ఆ ఉపమానము చెప్పెనని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి.

వారు మాటలలో ఆయనను చిక్కుపరచవలెనని, పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయనయొద్దకు పంపిరి.

వారు వచ్చి బోధకుడా, నీవు సత్యవంతుడవు; నీవు ఎవనిని లక్ష్యపెట్టనివాడవని మేమెరుగుదుము; నీవు మోమోటము లేనివాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా?

ఇచ్చెదమా ఇయ్యకుందుమా? అని ఆయన నడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నాయొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను.

వారు తెచ్చిరి, ఆయన ఈ రూపమును, పై వ్రాతయు, ఎవరివని వారినడుగగా వారు కైసరువి అనిరి.

అందుకు యేసు కైసరువి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పగా వారాయననుగూర్చి బహుగా ఆశ్చర్యపడిరి.

పునరుత్థానము లేదని చెప్పెడి సద్దూకయ్యులు ఆయనయొద్దకు వచ్చి

బోధకుడా, తన భార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను.

ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను

గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతానము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను.

ఇట్లు ఏడుగురును సంతానములేకయే చనిపోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను.

పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.

అందుకు యేసు మీరు లేఖనములనుగాని దేవుని శక్తినిగాని యెరుగకపోవుట వలననే పొరబడుచున్నారు.

వారు మృతులలోనుండి లేచునప్పుడు పెండ్లి చేసికొనరు, పెండ్లికియ్యబడరు గాని పరలోకమందున్న దూతలవలె నుందురు.

వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను.

ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను.

శాస్త్రులలో ఒకడు వచ్చి, వారు తర్కించుట విని, ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చెనని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన నడిగెను.

అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు.

నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననునది ప్రధానమైన ఆజ్ఞ.

రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను

ఆ శాస్త్రి బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే.

పూర్ణహృదయముతోను, పూర్ణవివేకముతోను, పూర్ణబలముతోను, ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాంగహోమములన్నిటికంటెను బలులకంటెను అధికమని ఆయనతో చెప్పెను.

అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.

ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు, దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి?

నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నా కుడివైపున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదే పరిశుద్ధాత్మవలన చెప్పెను.

దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఏలాగు అతని కుమారుడగునని అడిగెను. సామాన్యజనులు ఆయన మాటలు సంతోషముతో వినుచుండిరి.

మరియు ఆయన వారికి బోధించుచు నిట్లనెను శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంతవీధులలో వందనములను

సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు

విధవరాండ్ర యిండ్లు దిగమింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురనెను.

ఆయన కానుకపెట్టె యెదుట కూర్చుండి, జనసమూహము ఆ కానుకపెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైనవారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి.

ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా

ఆయన తన శిష్యులను పిలిచి కానుకపెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటె ఈ బీద విధవరాలు ఎక్కువ వేసెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి వేసిరి గాని, యీమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసెనని చెప్పెను.