పవిత్ర గ్రంథాలు

సంఖ్యాకాండము

అధ్యాయం 20

మొదటి నెలయందు ఇశ్రాయేలీయుల సర్వసమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేషులో దిగిరి. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను.

ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి.

జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినయెడల ఎంతో మేలు

అయితే మేమును మా పశువులును ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి?

ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును ఏల రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లే లేవనిరి.

అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుటనుండి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను.

అంతట యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను

నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము.

యెహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధినుండి ఆ కఱ్ఱను తీసికొనిపోయెను.

తరువాత మోషే అహరోనులు ఆ బండయెదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి; మేము ఈ బండలోనుండి మీకొరకు నీళ్లు రప్పింపవలెనా? అనెను.

అప్పుడు మోషే తన చెయ్యియెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను.

అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నులయెదుట నా పరిశుద్ధతను సన్మానించునట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకొనిపోరని చెప్పెను.

అవి మెరీబా జలమనబడెను; ఏలయనగా ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారిమధ్యను తన్ను పరిశుద్ధపరచుకొనెను.

మోషే కాదేషునుండి ఎదోము రాజునొద్దకు దూతలను పంపి నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది;

మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి; మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితివిు; ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి.

మేము యెహోవాకు మొఱపెట్టగా ఆయన మా మొఱనువిని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.

మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము; పొలములలో బడియైనను ద్రాక్షతోటలలో బడియైనను వెళ్లము; బావుల నీళ్లు త్రాగము; రాజమార్గమున నడిచిపోయెదము. నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను తిరుగకుండ పోయెదమని చెప్పించెను.

ఎదోమీయులు నీవు నా దేశములో బడి వెళ్లకూడదు; నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చెదను సుమీ అని అతనితో చెప్పగా

ఇశ్రాయేలీయులు మేము రాజమార్గముననే వెళ్లెదము; నేనును నా పశువులును నీ నీళ్లు త్రాగునెడల వాటి విలువ నిచ్చుకొందును మరేమి లేదు, కాలినడకనే దాటిపోవుదును; అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను.

అంతట ఎదోము బహు జనముతోను మహా బలముతోను బయలుదేరి వారికెదురుగా వచ్చెను.

ఎదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలోబడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతనియొద్దనుండి తొలగిపోయిరి.

అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులోనుండి సాగి హోరుకొండకు వచ్చెను.

యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

అహరోను తన పితరులతో చేర్చబడును; ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు.

నీవు అహరోనును అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని హోరుకొండ యెక్కి,

అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము. అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును.

యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. సర్వసమాజము చూచుచుండగా వారు హోరుకొండ నెక్కిరి.

మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదిగి వచ్చిరి.

అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలీయుల కుటుంబికులందరును అహరోనుకొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి.