క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 అహజ్యా తల్లియైన అతల్యా తన కుమారుడు మృతిబొందెనని తెలిసికొని లేచి రాజకుమారులనందరిని నాశనము చేసెను.
02 రాజైన యెహోరాము కుమార్తెయును అహజ్యాకు సహోదరియునైన యెహోషెబ అహజ్యా కుమారుడైన యోవాషును, హతమైన రాజకుమారులతో కూడ చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెను గనుక వారు అతనిని అతని దాదిని పడకగదిలో అతల్యాకు మరుగుగా ఉంచియుండుటచేత అతడు చంపబడకుండెను.
03 అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడ దాచబడియుండెను.
04 ఏడవ సంవత్సరమందు యెహోయాదా కావలికాయు వారిమీదను రాజదేహ సంరక్షకులమీదను ఏర్పడియున్న శతాధిపతులను పిలువనంపించి, యెహోవా మందిరములోనికి వారిని తీసికొనిపోయి, యెహోవా మందిరమందు వారిచేత ప్రమాణము చేయించి వారితో నిబంధనచేసి, వారికి ఆ రాజు కుమారుని కనుపరచి యీలాగు ఆజ్ఞాపించెను
05 మీరు చేయవలసినదేమనగా, విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు మీరు మూడు భాగములై యొక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై యుండవలెను;
06 ఒక భాగము సూరు గుమ్మముదగ్గర కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలెను, ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని యుండవలెను.
07 మరియు విశ్రాంతిదినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను.
08 మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని రాజుచుట్టు కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలో ప్రవేశించినయెడల వాని చంపవలెను, రాజు బయలుదేరి సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్ద ఉండవలెను.
09 శతాధిపతులు యాజకుడైన యెహోయాదా తమ కిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి, ప్రతి మనిషి తన తన మనుష్యులను తీసికొని విశ్రాంతిదినమున లోపల ప్రవేశింపవలసిన వారితోను, విశ్రాంతిదినమున బయలుదేరవలసిన వారితోను కలిసి యాజకుడైన యెహోయాదాయొద్దకు వచ్చెను.
10 యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటెలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా
11 కాపు కాయు వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకొని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని యెడమ కొనవరకు రాజు చుట్టు నిలిచిరి.
12 అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొనిపోయి అతని తలమీద కిరీటము పెట్టి, ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగా చేసి చప్పట్లుకొట్టి రాజు చిరంజీవియగునుగాకని చాటించిరి.
13 అతల్యా, కాయువారును జనులును కేకలువేయగా విని, యెహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి
14 రాజు ఎప్పటి మర్యాదచొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు, అధిపతులును బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు, దేశపు వారందరును సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా
15 యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి; ఆమె పక్షపువారిని ఖడ్గముచేత చంపుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక
16 రాజమందిరములోనికి గుఱ్ఱములు వచ్చు మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకొని చంపిరి.
17 అప్పుడు యెహోయాదా జనులు యెహోవా వారని ఆయన పేరట రాజుతోను జనులతోను నిబంధన చేయించెను, మరియు అతడు రాజుపేరట జనులతో నిబంధన చేయించెను.
18 అప్పుడు దేశపు జనులందరును బయలు గుడికిపోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను ఛిన్నాభిన్నములు చేసి, బయలునకు యాజకుడైన మత్తానును బలిపీఠముల ముందర చంపివేసిరి. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకొనుటకు మనుష్యులను నియమించెను.
19 అతడు శతాధిపతులను అధికారులను కాపుకాయు వారిని దేశపు జనులందరిని పిలిపింపగా వారు యెహోవా మందిరములో నున్న రాజును తీసికొని, కాపుకాయువారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనముమీద ఆసీనుడాయెను.
20 మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గముచేత చంపిన తరువాత దేశపు జనులందరును సంతోషించిరి, పట్టణమును నిమ్మళముగా ఉండెను.
21 యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్లవాడు.