Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 5

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రియైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.

02 తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొనివచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారులగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమకూర్చెను.

03 ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.

04 ఇశ్రాయేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి

05 రాజైన సొలొమోనును ఇశ్రాయేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱలను పశువులను బలిగా అర్పించిరి.

06 లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడారమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణములన్నిటిని తీసికొనివచ్చిరి.

07 మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.

08 మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందసమును దాని దండెలను కమ్మెను.

09 వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచబడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.

10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మందసమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియు లేదు.

11 యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.

12 ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలనుచేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,

13 వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాటకులును ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధస్థలములోనుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి.

14 అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువలేకపోయిరి.