Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 24

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యోవాషు ఏలనారంభించినప్పుడు ఏడు సంవత్సరముల యీడుగలవాడై యెరూషలేములో నలువది ఏండ్లు ఏలెను; అతని తల్లి బెయేర్షెబా కాపురస్థురాలైన జిబ్యా.

02 యాజకుడైన యెహోయాదా బ్రదికిన దినములన్నియు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

03 యెహోయాదా అతనికి యిద్దరు భార్యలను పెండ్లిచేసెను; అతడు కుమారులను కుమార్తెలను కనెను.

04 అంతట యెహోవా మందిరమును బాగుచేయవలెనని యోవాషునకు తాత్పర్యము పుట్టెను గనుక

05 అతడు యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగుచేయుటకై ఇశ్రాయేలీయులందరియొద్దనుండి ధనమును ఏటేట సమకూర్చుచు, ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికాజ్ఞ ఇచ్చెను. వారు దానిని త్వరగా చేయకపోయినందున

06 రాజు ప్రధానయాజకుడగు యెహోయాదాను పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడుచేసి, యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్ఠోపకరణములనన్నిటిని బయలుదేవత పూజకు ఉపయోగించిరి.

07 సాక్ష్యపు గుడారమును బాగుచేయుటకై యూదాలోనుండియు యెరూషలేములోనుండియు ఇశ్రాయేలీయుల సమాజకులచేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు చెప్పి తెప్పించలేదని యడిగెను.

08 కాబట్టి రాజు ఆజ్ఞ చొప్పున వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిరద్వారము బయట ఉంచిరి.

09 మరియు దేవుని సేవకుడైన మోషే అరణ్యమందు ఇశ్రాయేలీయులకు నిర్ణయించిన కానుకను యెహోవా యొద్దకు జనులు తేవలెనని యూదాలోను యెరూషలేములోను వారు చాటించిరి.

10 కాగా అధిపతులందరును జనులందరును సంతోషముగా కానుకలను తీసికొని వచ్చి చాలినంతమట్టుకు పెట్టెలో వేసిరి.

11 లేవీయులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచు వచ్చిరి; అందులో ద్రవ్యము విస్తారముగానున్నట్టు కనబడినప్పుడెల్ల, రాజుయొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్తయు వచ్చి, పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దానిని ఉంచుచు వచ్చిరి; వారీచొప్పున పలుమారు చేయుటచేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను.

12 అప్పుడు రాజును యెహోయాదాయును యెహోవా మందిరపు పనిచేయువారికి దానినిచ్చి, యెహోవా మందిరమును బాగుచేయుటకై కాసెవారిని వడ్లవారిని, యెహోవా మందిరమును బలపరచుటకు ఇనుపపని యిత్తడిపని చేయువారిని కూలికి కుదిర్చిరి.

13 ఈలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేసిరి. వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరచిరి.

14 అది సిద్ధమైన తరువాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకును యెహోయాదా యొద్దకును తీసికొనిరాగా వారు దానిచేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడునట్లును, దహనబలుల నర్పించుటయందు ఉపయోగపడునట్లును, ఉపకరణములను గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించిరి. యెహోయాదాయున్న యన్నిదినములు యెహోవా మందిరములో దహనబలులు నిత్యమును అర్పింపబడెను.

15 యెహోయాదా దినములు గడచిన వృద్ధుడై చనిపోయెను; అతడు చనిపోయినప్పుడు నూట ముప్పది ఏండ్లవాడు.

16 అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికిని తన యింటివారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజులదగ్గర అతని పాతిపెట్టిరి.

17 యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.

18 జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడచి, దేవతాస్తంభములకును విగ్రహములకును పూజచేసిరి; వారు, చేసిన యీ యపరాధము నిమిత్తము యూదావారిమీదికిని యెరూషలేము కాపురస్థులమీదికిని కోపము వచ్చెను.

19 తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారియొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారిమీద సాక్ష్యము పలికిరిగాని వారు చెవియొగ్గక యుండిరి.

20 అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను.

21 అందుకు వారతనిమీద కుట్రచేసి, రాజు మాటనుబట్టి యెహోవా మందిరపు ఆవరణములోపల రాళ్లు రువ్వి అతని చావగొట్టిరి.

22 ఈ ప్రకారము రాజైన యోవాషు జెకర్యా తండ్రియైన యెహోయాదా తనకు చేసిన ఉప కారమును మరచినవాడై అతని కుమారుని చంపించెను; అతడు చనిపోవునప్పుడు యెహోవా దీని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక యనెను.

23 ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను; వారు యూదాదేశముమీదికిని యెరూషలేముమీదికిని వచ్చి, శేషములేకుండ జనుల అధిపతులనందరిని హతముచేసి, తాము పట్టుకొనిన కొల్లసొమ్మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి.

24 సిరియనులు చిన్నదండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారిచేతికి అతివిస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను.

25 వారు యోవాషును విడచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగియైయుండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతనిమీద కుట్రచేసి, అతడు పడకమీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు.

26 అతనిమీద కుట్రచేసినవారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమీతు కుమారుడగు యెహోజాబాదు అనువారు.

27 అతని కుమారులనుగూర్చియు, అతనిమీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులనుగూర్చియు, అతడు దేవుని మందిరమును బాగుచేయుటనుగూర్చియు రాజుల సటీక గ్రంథములో వ్రాయబడియున్నది. అతనికి బదులుగా అతని కుమారుడైన అమజ్యా రాజాయెను.