Logo

2దినవృత్తాంతములు అధ్యాయము 26

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట యూదా జనులందరును పదునారేండ్లవాడైన ఉజ్జియాను తీసికొని అతని తండ్రియైన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి.

02 అతడు ఎలతును కట్టించి, రాజగు తన తండ్రి అతని పితరులతోకూడ నిద్రించిన తరువాత అది యూదావారికి తిరిగి వచ్చునట్లు చేసెను.

03 ఉజ్జియా యేలనారంభించినప్పుడు పదునారేండ్లవాడై యెరూషలేములో ఏబది రెండు సంవత్సరములు ఏలెను; అతని తల్లి యెరూషలేము కాపురస్థురాలు, ఆమె పేరు యెకొల్యా.

04 అతడు తన తండ్రియైన అమజ్యా చర్య యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను.

05 దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివికలిగిన జెకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లజేసెను.

06 అతడు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధముచేసి గాతు ప్రాకారమును యబ్నె ప్రాకారమును అష్డోదు ప్రాకారమును పడగొట్టి, అష్డోదు దేశములోను ఫిలిష్తీయుల ప్రదేశములలోను ప్రాకారపురములను కట్టించెను.

07 ఫిలిష్తీయులతోను గూర్బయలులో నివసించిన అరబీయులతోను మెహూనీయులతోను అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను.

08 అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధినొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను.

09 మరియు ఉజ్జియా యెరూషలేములో మూలగుమ్మము దగ్గరను, పల్లపుస్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూలదగ్గరను, దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరచెను.

10 అదియుగాక షెఫేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్షగలవాడు గనుక పర్వతములలోను కర్మెలులోను అతనికి వ్యవసాయకులును ద్రాక్షతోట పనివారును కలిగియుండిరి.

11 యుద్ధమునకు ఉజ్జియాకు సైన్యము కలిగియుండెను; అందులోని యోధులు రాజు అధిపతులలో హనన్యా అనువాని చేతిక్రిందనుండిరి. ఖజానాదారుడగు మయశేయాయు ప్రధానమంత్రియగు యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూచి వారిని పటాలముగా ఏర్పరచువారై యుండిరి.

12 వారి పితరుల యిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందల మందియైరి.

13 రాజునకు సహాయము చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరుపొందిన పరాక్రమశాలులైన మూడులక్షల ఏడు వేల ఐదువందలమంది గల సైన్యము వారిచేతిక్రింద ఉండెను.

14 ఉజ్జియా యీ సైన్యమంతటికి డాళ్లను ఈటెలను శిరస్త్రాణములను కవచములను విల్లులను వడిసెలలను చేయించెను.

15 మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడువరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను.

16 అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠముమీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవామీద ద్రోహము చేయగా

17 యాజకుడైన ఆజర్యాయు అతనితోకూడ ధైర్యవంతులైన యెహోవా యాజకులు ఎనుబది మందియు అతని వెంబడి లోపలికిపోయిరి.

18 వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధ స్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా

19 ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తినిచేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్కనతడు ఉండగా యాజకులు చూచుచునేయున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను.

20 ప్రధానయాజకుడైన అజర్యాయును యాజకులందరును అతనివైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై యుండెను. గనుక వారు తడవుచేయక అక్కడనుండి అతనిని బయటికి వెళ్లగొట్టిరి; యెహోవా తన్ను మొత్తెనని యెరిగి బయటికివెళ్లుటకు తానును త్వరపడెను.

21 రాజైన ఉజ్జియా తన మరణదినమువరకు కుష్ఠరోగియై యుండెను. కుష్ఠరోగియై యెహోవా మందిరములోనికి పోకుండ ప్రత్యేకింపబడెను గనుక అతడు ప్రత్యేకముగా ఒక యింటిలో నివసించుచుండెను; అతని కుమారుడైన యోతాము రాజు ఇంటివారికి అధిపతియై దేశపు జనులకు న్యాయము తీర్చుచుండెను.

22 ఉజ్జియా చేసిన యితర కార్యములనుగూర్చి ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా వ్రాసెను.

23 ఉజ్జియా తన పితరులతో కూడ నిద్రించెను. అతడు కుష్ఠరోగియని రాజుల సంబంధమైన శ్మశానభూమిలో అతని పితరులదగ్గర అతని పాతిపెట్టిరి. అతని కుమారుడైన యోతాము అతనికి బదులుగా రాజాయెను.