క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి
01 ఆసా యేలుబడియందు ముప్పది ఆరవ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదావారిమీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసాయొద్దకు రాకపోకలు జరుగకుండునట్లు రామాను కట్టింపగా
02 ఆసా యెహోవా మందిరమందును రాజనగరునందును ఉన్న బొక్కసములలోని వెండి బంగారములను తీసి, దమస్కులో నివాసముచేయు సిరియా రాజగు బెన్హదదు నొద్దకు దూతలచేత పంపించి
03 నా తండ్రికిని నీ తండ్రికిని కలిగియున్నట్లు నాకును నీకును సంధి కలిగియున్నది, వెండిని బంగారమును నీకు పంపియున్నాను, ఇశ్రాయేలు రాజైన బయెషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసియున్న సంధిని భంగము చేయుమని వర్తమానము చేసెను.
04 బెన్హదదు రాజైన ఆసా మాట అంగీకరించి, తన సైన్యముల అధిపతులను ఇశ్రాయేలువారి పట్టణములమీదికి పంపగా వీరు ఈయోనును దానును ఆబేల్మాయీమును నఫ్తాలి ప్రదేశమునకు చేరిన పట్టణములలోని కొట్లను కొల్లపెట్టిరి.
05 బయెషా అది విని రామాను ప్రాకారములతో కట్టించుట మానివేసి తాను చేయుచున్న పని చాలించెను.
06 అప్పుడు రాజైన ఆసా యూదా వారినందరిని సమకూర్చెను; వీరు పోయి బయెషా కట్టించుచుండిన రామా పట్టణపు రాళ్లను దూలములను తీసికొనివచ్చిరి, వాటితో ఆసా గెబను మిస్పాను ప్రాకార పురములుగా కట్టించెను.
07 ఆ కాలమందు దీర్ఘదర్శియైన హనానీ యూదా రాజైన ఆసాయొద్దకు వచ్చి అతనితో ఈలాగు ప్రకటించెను నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకొంటివే? సిరియా రాజుయొక్క సైన్యము నీ వశమునుండి తప్పించుకొనిపోయెను.
08 బహు విస్తారమైన రథములును గుఱ్ఱపు రౌతులునుగల కూషీయులును లూబీయులును గొప్ప దండై వచ్చిరిగదా? అయినను నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీచేతి కప్పగించెను.
09 తనయెడల యథార్థహృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతితప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.
10 ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందుకు ఆసా అతనిమీద కోపగించి రౌద్రము చూపి అతనిని బందీగృహములో వేసెను, ఇదియు గాక ఆ సమయమందే ఆసా జనులలో కొందరిని బాధపరచెను.
11 ఆసా చేసిన కార్యములన్నిటినిగూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది.
12 ఆసా తన యేలుబడియందు ముప్పది తొమ్మిదవ సంవత్సరమున పాదములలో జబ్బుపుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవాయొద్ద విచారణచేయక వైద్యులను పట్టుకొనెను.
13 ఆసా తన పితరులతో కూడ నిద్రించి తన యేలుబడియందు నలువది యొకటవ సంవత్సరమున మృతినొందగా
14 అత్తరు పనివారిచేత సిద్ధము చేయబడిన సుగంధ వర్గములతోను పరిమళద్రవ్యములతోను నిండిన పడకమీద జనులు అతని ఉంచి, అతని నిమిత్తము బహు విస్తారమైన గంధవర్గములను దహించి, దావీదు పట్టణమందు అతడు తనకొరకై తొలిపించుకొనిన సమాధియందు అతని పాతిపెట్టిరి.