Logo

లూకా అధ్యాయము 23

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 అంతట వారందరును లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసికొనిపోయి

02 ఇతడు మా జనమును తిరుగబడ ప్రేరేపించుచు, కైసరునకు పన్నియ్యవద్దనియు, తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయనమీద నేరము మోపసాగిరి.

03 పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను.

04 పిలాతు ప్రధానయాజకులతోను జనసమూహములతోను ఈ మనుష్యునియందు నాకు ఏ నేరమును కనబడలేదనెను.

05 అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతట ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి.

06 పిలాతు ఈ మాట విని ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి

07 ఆయన హేరోదు అధికారము క్రింద ఉన్న ప్రదేశపువాడని తెలిసికొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను.

08 హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయననుగూర్చి చాల సంగతులు విన్నందున ఆయన ఏదైనను ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి, బహుకాలమునుండి ఆయనను చూడగోరెను.

09 ఆయనను చూచినప్పుడు చాల ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియు ఇయ్యలేదు.

10 ప్రధానయాజకులును శాస్త్రులును నిలువబడి ఆయనమీద తీక్షణముగా నేరము మోపిరి.

11 హేరోదు తన సైనికులతో కలిసి, ఆయనను తృణీకరించి అపహసించి, ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరల పంపెను.

12 అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై యుండి ఆ దినముననే యొకనికొకడు మిత్రులైరి.

13 అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి

14 ప్రజలు తిరుగబడునట్లు చేయుచున్నాడని మీరీ మనుష్యుని నాయొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీయెదుట ఇతనిని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు

15 హేరోదునకు కూడ కనబడలేదు. హేరోదు అతని మాయొద్దకు తిరిగి పంపెను గదా; ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు.

16 కాబట్టి నేనితనిని

17 శిక్షించి విడుదలచేయుదునని వారితో చెప్పగా

18 వారందరు వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదలచేయుమని ఏకగ్రీవముగా కేకలువేసిరి.

19 వీడు పట్టణములో జరిగించిన యొక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు.

20 పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాటలాడినను.

21 వారు వీనిని సిలువ వేయుము సిలువ వేయుము అని కేకలువేసిరి.

22 మూడవమారు అతడు ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతనియందు మరణమునకు తగిన నేరమేమియు నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదలచేతునని వారితో చెప్పెను.

23 అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలువేసి, వీనిని సిలువ వేయుమని అడుగగా వారి కేకలే గెలిచెను.

24 కాగా వారడిగినట్టే జరుగవలెనని పిలాతు తీర్పుతీర్చి

25 అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి యుండినవానిని వారడిగినట్టు వారికి విడుదలచేసి, యేసును వారికిష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను.

26 వారాయనను తీసికొనిపోవుచుండగా పల్లెటూరినుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకని పట్టుకొని, యేసువెంట సిలువను మోయుటకు అతనిమీద దానిని పెట్టిరి.

27 గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.

28 యేసు వారివైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.

29 ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి.

30 అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.

31 వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.

32 మరి యిద్దరు ఆయనతో కూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.

33 వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.

34 యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.

35 ప్రజలు నిలువబడి చూచుచుండిరి; అధికారులును వీడు ఇతరులను రక్షించెను; వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయినయెడల తన్నుతాను రక్షించుకొనునని అపహసించిరి.

36 అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి

37 నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి.

38 ఇతడు యూదుల రాజని పైవిలాసము కూడ ఆయనకు పైగా వ్రాయబడెను.

39 వ్రేలాడవేయబడిన ఆ నేరస్థులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గదా? నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడ రక్షించుమని చెప్పెను.

40 అయితే రెండవవాడు వానిని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా?

41 మనకైతే యిది న్యాయమే; మనము చేసినవాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని యీయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి

42 ఆయనను చూచి యేసూ, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసికొనుమనెను.

43 అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.

44 అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటిమీద చీకటి కమ్మెను;

45 సూర్యుడు అదృశ్యుడాయెను; గర్భాలయపు తెర నడిమికి చినిగెను.

46 అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీచేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

47 శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.

48 చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగివెళ్లిరి.

49 ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబడించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.

50 అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను.

51 అతడు సజ్జనుడును నీతిమంతుడునై యుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యముకొరకు కనిపెట్టుచుండినవాడు.

52 అతడు పిలాతు నొద్దకు వెళ్లి, యేసు దేహము (తనకిమ్మని) అడుగుకొని

53 దానిని క్రిందికి దించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు మునుపెప్పుడును ఉంచబడలేదు.

54 ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను.

55 అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి

56 తిరిగివెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.