Logo

లూకా అధ్యాయము 4

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగివచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి

02 అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

03 అపవాది నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను

04 అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

05 అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి

06 ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడి యున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

07 కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.

08 అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

09 పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము

10 నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.

11 నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను.

12 అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

13 అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.

14 అప్పుడు యేసు, ఆత్మ బలముతో గలిలయకు తిరిగివెళ్లెను; ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతట వ్యాపించెను.

15 ఆయన అందరి చేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను.

16 తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజమందిరములోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా

17 ప్రవక్తయైన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను; ఆయన గ్రంథము విప్పగా --

18 ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

19 ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

20 ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను.

21 సమాజ మందిరములో నున్నవారందరు ఆయనను తేరిచూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను.

22 అప్పుడందరును ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటలకాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా

23 ఆయన వారిని చూచి వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.

24 మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

25 ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,

26 ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.

27 మరియు ప్రవక్తయైన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను, సిరియ దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

28 సమాజమందిరములో ఉన్నవారందరు ఆ మాటలు విని

29 ఆగ్రహముతో నిండుకొని, లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్లగొట్టి, ఆయనను తలక్రిందుగా పడద్రోయవలెనని తమ పట్టణము కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసికొనిపోయిరి.

30 అయితే ఆయన వారి మధ్యనుండి దాటి తన మార్గమున వెళ్లిపోయెను.

31 అప్పుడాయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, విశ్రాంతిదినమున వారికి బోధించుచుండెను.

32 ఆయన వాక్యము అధికారముతో కూడినదై యుండెను గనుక వారాయన బోధకు ఆశ్చర్యపడిరి.

33 ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యపు ఆత్మపట్టిన వాడొకడుండెను.

34 వాడు నజరేయుడవైన యేసూ, మాతో నీకేమి? మమ్ము నశింపజేయ వచ్చితివా? నీవెవడవో నేనెరుగుదును; నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను.

35 అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదలి పొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదలిపోయెను.

36 అందుకందరు విస్మయమొంది ఇది ఎట్టి మాట? ఈయన అధికారముతోను బలముతోను అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదలిపోవుచున్నవని యొకనితోనొకడు చెప్పుకొనిరి.

37 అంతట ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను.

38 ఆయన సమాజమందిరములో నుండి లేచి, సీమోను ఇంటిలోనికి వెళ్లెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడియుండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసికొనిరి.

39 ఆయన ఆమె చెంతను నిలువబడి, జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను; వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను.

40 సూర్యుడస్తమించుచుండగా నానావిధ రోగములచేత పీడింపబడుచున్నవారు ఎవరెవరియొద్ద నుండిరో వారందరు ఆ రోగులను ఆయన యొద్దకు తీసికొనివచ్చిరి; అప్పుడాయన వారిలో ప్రతివానిమీద చేతులుంచి, వారిని స్వస్థపరచెను.

41 ఇంతేకాక దయ్య ములునీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదలిపోయెను; ఆయన క్రీస్తు అని వాటికి తెలిసియుండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటాడనీయలేదు.

42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి, తమ్మును విడిచిపోకుండ ఆపగా

43 ఆయన నేనితర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను.

44 తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.