Logo

లేవీయకాండము అధ్యాయము 14

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను

02 కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వానిగూర్చిన విధి యేదనగా, యాజకునియొద్దకు వానిని తీసికొనిరావలెను.

03 యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచినయెడల

04 యాజకుడు పవిత్రత పొందగోరు వానికొరకు సజీవమైన రెండు పవిత్ర పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను.

05 అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటిపాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప నాజ్ఞాపించి

06 సజీవమైన పక్షిని ఆ దేవదారు కఱ్ఱను రక్తవర్ణముగల నూలును హిస్సోపును తీసికొని పారు నీటిపైని చంపిన పక్షిరక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి

07 కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరువానిమీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.

08 అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉదుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసికొని నీళ్లతో స్నానముచేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల ఏడు దినములు నివసింపవలెను.

09 ఏడవనాడు తన రోమమంతటిని తన తలను తన గడ్డమును తన కనుబొమలను క్షౌరము చేసికొనవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసికొని బట్టలు ఉదుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును.

10 ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.

11 పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనుష్యుని వాటితో ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను.

12 అప్పుడు యాజకుడు ఒక మగ గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అపరాధపరిహారార్థబలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

13 అతడు పాపపరిహారార్థబలి పశువును దహనబలి పశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైన దానివలె అపరాధపరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.

14 అప్పుడు యాజకుడు అపరాధపరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను, దానిని చమరవలెను.

15 మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన యెడమ అరచేతిలో పోసికొనవలెను.

16 అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.

17 యాజకుడు తన అరచేతిలోనున్న కొదువనూనెలో కొంచెము తీసికొని పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఉన్న అపరాధపరిహారార్థబలి పశువుయొక్క రక్తముమీద చమరవలెను.

18 అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువనూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.

19 అప్పుడు యాజకుడు పాపపరిహారార్థబలి అర్పించి అపవిత్రత పోగొట్టుకొని పవిత్రత పొందగోరువాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను.

20 యాజకుడు దహనబలి ద్రవ్యమును నైవేద్యమును బలిపీఠముమీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును.

21 వాడు బీదవాడై పైచెప్పినదంతయు తేజాలనియెడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధపరిహారార్థబలిగా ఒక గొఱ్ఱపిల్లను నైవేద్యముగా తూములో పదియవవంతు నూనెతో కలిసిన గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను

22 వారికి దొరకగల రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని, అనగా పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒక దానిని తీసికొనిరావలెను.

23 వాడు పవిత్రతపొంది ఎనిమిదవనాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమునకు యాజకునియొద్దకు వాటిని తీసికొనిరావలెను.

24 యాజకుడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను అర్ధసేరు నూనెను తీసికొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను.

25 అప్పుడతడు అపరాధపరిహారార్థబలియగు గొఱ్ఱపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధపరిహారార్థబలి పశువుయొక్క రక్తములో కొంచెము తీసికొని, పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను దానిని చమరవలెను.

26 మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన యెడమ అరచేతిలో పోసికొని

27 తన యెడమచేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.

28 మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరువాని కుడిచెవి కొనమీదను, వాని కుడిచేతి బొటనవ్రేలిమీదను, వాని కుడికాలి బొటనవ్రేలిమీదను ఆ అపరాధపరిహారార్థబలి పశువుయొక్క రక్తమున్న చోటను వేయవలెను.

29 యాజకుని అరచేతిలోనున్న కొదువనూనెను అతడు పవిత్రత పొందగోరువానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలుగజేయుటకు వాని తలమీద పోయవలెను.

30 అప్పుడు వానికి దొరకగల ఆ తెల్ల గువ్వలలోనేగాని పావురపు పిల్లలలోనేగాని ఒక దాని నర్పింపవలెను.

31 తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాపపరిహారార్థబలిగా ఒక దానిని దహనబలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరువాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను.

32 కుష్ఠుపొడ కలిగినవాడు పవిత్రత పొందతగినవాటిని సంపాదింపలేనియెడల వాని విషయమైన విధి యిదే.

33 మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను

34 నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములోని యే యింటనైనను నేను కుష్ఠుపొడ కలుగజేసినయెడల

35 ఆ యింటి యజమానుడు యాజకునియొద్దకు వచ్చి నా యింటిలో కుష్ఠుపొడ వంటిది నాకు కనబడెనని అతనికి తెలియచెప్పవలెను.

36 అప్పుడు ఆ యింటనున్నది యావత్తును అపవిత్రము కాకుండునట్లు, యాజకుడు ఆ కుష్ఠుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ యిల్లు వట్టిదిగా చేయ నాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ యిల్లు చూచుటకై లోపలికి వెళ్లవలెను.

37 అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ యింటి గోడలయందు పచ్చదాళుగానైనను ఎఱ్ఱదాళుగానైనను ఉండు పల్లపుచారలు గలదై గోడకంటె పల్లముగా ఉండినయెడల

38 యాజకుడు ఆ యింటనుండి యింటివాకిటికి బయలువెళ్లి ఆ యిల్లు ఏడు దినములు మూసియుంచవలెను.

39 ఏడవనాడు యాజకుడు తిరిగివచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ యింటి గోడలయందు వ్యాపించినదైనయెడల

40 యాజకుని సెలవుచొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారవేయవలెను.

41 అప్పుడతడు ఆ యింటిలోపలను చుట్టు గోడలను గీయింపవలెను. వారు గీసిన పెల్లలను ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమున పారబోసి

42 వేరు రాళ్లను తీసికొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ యింటిగోడకు పూయింపవలెను.

43 అతడు ఆ రాళ్లను ఊడదీయించి యిల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ యింట బయలుపడినయెడల యాజకుడు వచ్చి దాని చూడవలెను.

44 అప్పుడు ఆ పొడ ఆ యింట వ్యాపించినయెడల అది ఆ యింటిలో కొరుకుడు కుష్ఠము; అది అపవిత్రము.

45 కాబట్టి అతడు ఆ యింటిని దాని రాళ్లను కఱ్ఱలను సున్నమంతటిని పడగొట్టించి ఊరివెలుపలనున్న అపవిత్రస్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను.

46 మరియు ఆ యిల్లు పాడువిడిచిన దినములన్నియు దానిలో ప్రవేశించువాడు సాయంకాలమువరకు అపవిత్రుడగును.

47 ఆ యింట పండుకొనువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ యింట భోజనము చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను.

48 యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచునప్పుడు ఆ యింటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ యింటిలో వ్యాపింపకపోయినయెడల, పొడ బాగుపడెను గనుక ఆ యిల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను.

49 ఆ యింటి కొరకు పాపపరిహారార్థబలి అర్పించుటకు అతడు రెండు పక్షులను దేవదారు కఱ్ఱను రక్తవర్ణపు నూలును హిస్సోపును తీసికొని

50 పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి

51 ఆ దేవదారు కఱ్ఱను హిస్సోపును రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసికొని వధింపబడిన పక్షిరక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ యింటిమీద ఏడు మారులు ప్రోక్షింపవలెను.

52 అట్లు ఆ పక్షిరక్తముతోను ఆ పారు నీటితోను సజీవమైన పక్షితోను దేవదారు కఱ్ఱతోను హిస్సోపుతోను రక్త వర్ణపు నూలుతోను ఆ యింటి విషయములో పాపపరిహారార్థబలి అర్పింపవలెను.

53 అప్పుడు సజీవమైన పక్షిని ఊరివెలుపల నెగర విడువవలెను. అట్లు అతడు ఆ యింటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును.

54 ప్రతివిధమైన కుష్ఠుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు

55 వస్త్రకుష్ఠమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్ఠమును గూర్చియు,

56 వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,

57 ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి.