Logo

ద్వితియోపదేశాకాండము అధ్యాయము 31

క్రాస్ రిఫరెన్స్ కొరకు వచనము యొక్క నంబర్ మీద క్లిక్/టచ్ చెయ్యండి

01 మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరల ఇట్లనెను నేడు నేను నూట ఇరువది యేండ్లవాడనై యున్నాను.

02 ఇకమీదట నేను వచ్చుచుపోవుచు నుండలేను, యెహోవా ఈ యొర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను.

03 నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ యెదుట నుండకుండ నశింపజేయును, నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందువు. యెహోవా సెలవిచ్చియున్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును.

04 యెహోవా నశింపజేసిన అమోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారముగానే యీ జనములకును చేయును.

05 నేను మీకాజ్ఞాపించిన దానినంతటినిబట్టి మీరు వారికి చేయునట్లు యెహోవా నీచేతికి వారిని అప్పగించును. నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుడి

06 భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతోకూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.

07 మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితోకూడ పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను.

08 నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుమని ఇశ్రాయేలీయులందరియెదుట అతనితో చెప్పెను.

09 మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికిని దానినప్పగించి

10 వారితో ఇట్లనెను ప్రతి యేడవ సంవత్సరాంతమున, అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున

11 నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరు ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించునప్పుడు ఇశ్రాయేలీయులందరి యెదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను.

12 మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.

13 ఆలాగు నేర్చుకొనినయెడల దానినెరుగని వారి సంతతివారు దానిని విని, మీరు స్వాధీనపరచుకొనుటకు యొర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రదుకు దినములన్నియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు.

14 మరియు యెహోవా చూడుము; నీ మరణదినములు సమీపించెను; నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారములో నిలువుడని మోషేతో సెలవియ్యగా,

15 మోషేయు యెహోషువయు వెళ్లి ప్రత్యక్షపు గుడారములో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్షమాయెను; ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారముపైని నిలువగా

16 యెహోవా మోషేతో యిట్లనెను ఇదిగో నీవు నీ పితరులతో పండుకొనబోవుచున్నావు. ఈ జనులు లేచి, యెవరి దేశమున తాము చేరి వారినడుమ నుందురో ఆ జనులమధ్యను వ్యభిచారులై, ఆ అన్యుల దేవతల వెంట వెళ్లి నన్ను విడిచి, నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు.

17 కావున నా కోపము ఆ దినమున వారిమీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును, వారు క్షీణించిపోవుదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా యీ కీడులు మనకు ప్రాప్తించెననుకొందురు.

18 వారు అన్యదేవతలతట్టు తిరిగి చేసిన కీడంతటినిబట్టి ఆ దినమున నేను నిశ్చయముగా వారికి విరోధినగుదును.

19 కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయులమీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.

20 నేను వారి పితరులతో ప్రమాణము చేసినట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత, వారు తిని త్రాగి తృప్తిపొంది క్రొవ్వినవారై అన్యదేవతలతట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు.

21 విస్తారమైన కీడులు ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారియెదుట సాక్షిగానుండి సాక్ష్యము పలుకును. అది మరువబడక వారి సంతతివారి నోటనుండును. నేను ప్రమాణము చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టకమునుపే, నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను.

22 కాబట్టి మోషే ఆ దినమందే యీ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను.

23 మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను నీవు నిబ్బరము గలిగి ధైర్యముగా నుండుము; నేను ప్రమాణ పూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొనిపోవలెను, నేను నీకు తోడైయుందును.

24 ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సాంతముగా వ్రాయుట ముగించిన తరువాత

25 మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసికొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి.

26 అది అక్కడ నీమీద సాక్ష్యార్థముగా ఉండును.

27 నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంక సజీవుడనై మీతో ఉండగానే, ఇదిగో మీరు యెహోవామీద తిరుగుబాటు చేసితిరి.

28 నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురుకదా మీ గోత్రముల పెద్దలనందరిని మీ నాయకులను నాయొద్దకు పోగుచేయుడి. ఆకాశమును భూమిని వారిమీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను.

29 ఏలయనగా నేను మరణమైన తరువాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకాజ్ఞాపించిన మార్గమును తప్పుదురనియు, ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేనెరుగుదును. మీరు చేయు క్రియలవలన యెహోవాకు కోపము పుట్టించునట్లుగా ఆయన దృష్టికి కీడైనదాని చేయుదురు.

30 అప్పుడు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముయొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు సాంతముగా పలికెను.